చిత్రంలో రాజకీయ కక్షతో బడ్డీకొట్టుపై వేసిన రేకులను తొలగించడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నది రేగిడి మండలంలోని మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన 70 ఏళ్ల మంకు గణపతిరావు, అతని భార్య గౌరీశ్వరమ్మ. రోడ్డు పక్కన టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గణపతిరావుకు కొన్నేళ్ల కిందట ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా గుండె ఆపరేషన్ జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే పైసా ఖర్చులేకుండా ఆపరేషన్ జరిగిందని, ప్రాణం నిలబడిందని ఆ వృద్ధ దంపతులు వైఎస్సార్కు వీరాభిమానులయ్యారు. తమ టీ షాపులో వైఎస్సార్ చిత్రపటం పెట్టుకుని పూజలు చేస్తుంటారు. ఈ కొట్టులో వైఎస్సార్ ఫొటోలు ఉండడం ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలకు నచ్చలేదు. వైఎస్సార్ ఫొటో తీసేయాలని పట్టుబట్టారు. కావాలంటే మీరు చెప్పిన వారికి ఓటేస్తాం కానీ, వైఎస్సార్ ఫొటోను పూజించడం మానలేమని వృద్ధులు స్పష్టంచేశారు. దీనిని సహించలేని పచ్చపార్టీ కార్యకర్తలు బలవంతంగా బడ్డీకొట్టుపై రక్షణగా వేసిన రేకుల షెడ్డును ఓ వైపు నేలమట్టం చేశారు. రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో బడ్డీకొట్టు ఉందనే ఆరోపణలతో ఉపాధిని దూరం చేయాలని చూస్తున్నారంటూ వృద్ధులు వాపోయారు. పేదలపై రాజకీయ కక్షకట్టడంపై కన్నీరుపెడుతున్నారు. పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
– రేగిడి


