విజయనగరం అర్బన్: రాజాం మండలం నందబలగ పంచాయతీలో కేంద్ర ఎన్నిక సంఘం నిర్వహిస్తున్న ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, స్థానిక బీఎల్ఓ అధికార పార్టీకి తొత్తుగా మారి పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ ఆరోపించారు. దీనిపై విజయనగరం కలెక్టరేట్లో డీఆర్వోకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్నంబర్ 193 బీఎల్ఓగా పనిచేస్తున్న కస్పా ఆదినారాయణ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ఇల్లులేని వారికి, డోర్ నెంబర్లు సక్రమంగా లేని వారికి, పూర్తిగా వలస వెళ్లిపోయిన వారికి సైతం ఇక్కడే నివాసం ఉంటున్నట్లు నమోదుచేసి సుమారు 200 దొంగ ఓట్లను డిజిటలైజేషన్ చేశారన్నారు. అన్ని వివరాలు సరిగా ఉండి, స్థానికంగా నివసిస్తున్న వైఎస్సార్సీపీ అనుకూల వర్గీయుల ఓట్లను తిరస్కరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన అక్రమాలపై ఇప్పటికే స్థానిక ఈఆర్ఓ, రాజాం మండల ఏఈఆర్ఓలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే జిల్లా అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. అర్హులైన స్థానికులందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. డీఆర్ఓను కలిసిన వారిలో నందబలగ మాజీ సర్పంచ్ కొర్ను ఈశ్వరరావు, బింగి సూర్యనారాయణ, గ్రామస్తులు పలువురు ఉన్నారు.


