మక్కువ: మన్యం జిల్లాలో వరుస దొంగతనాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల పంట పొలాల్లో ఉన్న మోటారు వైర్లు, వ్యవసాయ పరికరాలు, ఎరువులు సైతం లూటీకి గురవుతుండడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన రైతు శేషగిరిరావు, నగుళ్లు గ్రామ సమీపంలోని తన పంట పొలంలో వ్యవసాయ పంటల సాగు కోసం రేకుల షెడ్లో నిల్వ చేసిన 55 బస్తాల ఎరువులను ఐదు రోజుల కిందట దొంగలు ఎత్తుకుపోయారు. అలాగే మార్కొండపుట్టి గ్రామానికి చెందిన రైతు తేలు శ్రీరాములునాయుడుకు చెందిన దమ్ము సెట్, కె.పెద్దవలస గ్రామానికి చెందిన పోలి రాజుకు చెందిన ట్రాక్టర్ ఫుల్ వీల్స్, మార్కొండపుట్టి గ్రామానికి చెందిన కుమార్కు చెందిన ట్రాక్టర్ ఆఫ్ వీల్స్ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఎర్రసామంతవలస, పాయికపాడు, తూరుమామిడి గ్రామాలకు చెందిన పలువురి రైతుల పొలాల్లో మోటారు వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. సాలూరు మండలం పంచాయివలసకు చెందిన రైతు పుల్లాజికి చెందిన 150 బస్తాల ఎరువులను ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నారు. శంబర గ్రామానికి చెందిన గంజి మురళి అనే కౌలు రైతుకు చెందిన మూడు మోటార్లకు చెందిన వైర్లను కట్ చేసేశారు. దీంతో మురళి లబోదిబోమంటున్నాడు. పార్వతీపురం మండలం ఎంఆర్ నగర్ సమీపంలోని మోటారు వైర్లను కట్ చేసేసినట్టు బాధిత రైతులు తెలిపారు. మోటారు వైర్లను కట్ చేసి అందులో ఉన్న కాపర్ను స్క్రాప్ దుకాణాలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. స్క్రాప్ దుకాణదారులు అనుమానిత వ్యక్తుల నుంచి కాపర్ను కొనుగోలు చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. చోరీలు జరిగిన ప్రదేశాల్లో పోలీసులు క్షేత్ర స్థాయిలో శనివారం పరిశీలించినట్టు రైతులు తెలిపారు. వరుస దొంగతనాలపై పోలీసులు నిఘా పెంచాలని రైతులు కోరుతున్నారు.


