ఉద్యోగులకు వంచన..!
రామభద్రపురం ఉన్నత పాఠశాల ఆవరణలో పోస్టుకార్డు క్యాంపెయిన్ చేపడుతున్న యూటీఎఫ్ నాయుకులు,ఉపాధ్యాయులు
రామభద్రపురం: చంద్రబాబుతో జతకట్టిన పవన్ కల్యాణ్ సైతం సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలపై హామీల వర్షం కురిపించారు. మాకు అధికారం ఇచ్చి చూడండి ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం. పెండింగ్ బకాయిలన్నింటినీ ఒకేసారి చెల్లిస్తాం. సకాలంలో జీతాలు,పెన్షన్లు,ఇతర ఆర్థిక ప్రయోజనాలను అందించే ఏర్పాట్లు చేస్తాం. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల కోసం రాజకీయ నాయుకుల చట్టూ తిరిగే పని లేకుండా చేస్తాం.ఉద్యోగుల పని భారం తగ్గిస్తాం అంటూ ఇలా ఎన్నో అలవిగాని హామీలతో చంద్రబాబు ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయినా ఇంతవరకూ మాయమాటలతో ఊరడించడం తప్ప ఉద్యోగులకు వాస్తవంలో చేసేది ఏమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల సమస్యల ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి వారి ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఉద్యోగ సంఘాలు నిత్యం చేస్తున్న విజ్ఞాపనలను సైతం ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చకపోతే ఉద్యమాలకు సిద్ధం అంటూ కూటమి సర్కారుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
ఇంకెన్నాళ్లు ఎదురు చూపు..
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగిన ప్రతిసారీ తమ సమస్యలపై ఏమైనా చర్చిస్తారేమోనని ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులు ఏడాదిగా ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వస్తున్నారు.ఈ 14వ తేదీన జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా కనీసం ఆ ఊసేఎత్తలేదు.ఇప్పటికే ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్లో ఉండగా జూలైతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది.అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.అదీ లేదు.పీఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఇప్పటి వరకూ కొత్త కమిషన్ను నియమించలేదు.కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తోందని సాగదీస్తూ వస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఐఆర్,పీఆర్సీ పెండింగ్ డీఏలపై నోరుమెదపని సర్కారు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల
రెగ్యులైజేషన్ గాలిలో
సమస్యలపై ఉద్యమాలకు
సిద్ధమవుతున్న ఉద్యోగులు
17వ తేదీన చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు


