స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విజయనగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేసిన సంక్షేమపథకాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధిని గర్వంగా, ధైర్యంగా చెప్పాలని పార్టీ శ్రేణులకు ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, పార్టీ పీఏసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఆ ధైర్యంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీని విజయపథంలో నడిపించాలని కోరారు. కోలగట్ల నివాసంలో మంగళవారం పార్టీ విజయనగరం నగర సమావేశం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు నగరంలో క్లస్టర్ ఇన్చార్జిలుగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీ కమిటీల నియామకం వల్ల మరింత బలోపేతమయ్యామన్నారు. పార్టీ సిద్ధాంతాలను, అధికార పార్టీ చేస్తున్న ప్రజ్యావతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కమిటీల ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిటీలో ఉన్న సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.
● ఇచ్చిన హమీలు అమలు ఏమయ్యాయి...?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇచ్చిన ప్రతి హమీని ప్రకటించిన తేదీల్లో అమలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగామని, ప్రతి 6 నెలలకోసారి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు.
● 2024 జూన్ నెల నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు కనీసం దరఖాస్తులు సేకరించని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి , నిరుద్యోగ యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి నేతలు చెప్పిన హమీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజలు ఓటుతో తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
● ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న చంద్రబాబు అదే ఎన్టీఆర్ ఫొటోకు దండం పెట్టి దండవేసి ఓట్లు దండుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఛరిష్మా లేకపోతే చంద్రబాబు పరిస్థితి ఒకటికి ముందు సున్నాలా ఉండేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు కోలగట్ల కృష్ణారావు, కంటుభుక్త తవిటిరాజు, అవనాపు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
కూటమి 20 నెలల పాలనలో చేసింది శూన్యం
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్లలో విజయనగరం మండలం, నగరం పరిధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో ఏం చేశారో చెప్పుకునేందుకు లేదని కోలగట్ల పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన హయాంలో జరిగిన అభివృద్ధిని ధైర్యంగా, గర్వంగా చెప్పగలమన్నారు. మండువేసవిలో తాగు నీటికి ఇబ్బందులు లేకుండా 13 వాటర్ ట్యాంక్లు నిర్మించడంతో పాటు, నూతన పైప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మహిళా పార్కు నిర్మించామని, అచంటా గార్డెన్ను సుందరంగా తీర్చిదిద్దామని, చెరువులు, జంక్షన్లు, పార్కులు అభివృద్ధి చేసి నగరానికి కార్పొరేషన్ రూపు తీసుకొచ్చామన్నారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ నేతలు కరపత్రాలు పంచడం మినహా చేసినది శూన్యమన్నారు. పంది ఫొటో వేసి నందిగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవాచేశారు.
డివిజన్ కమిటీల నియామకాలను
త్వరితగతిన పూర్తిచేయాలి
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
వైఎస్సార్సీపీ హయాంలోనే
అభివృద్ధి, ప్రజాసంక్షేమం
20 నెలల కూటమి పాలనలో
చెప్పుకునేందుకు చేసిందేమీ లేదు
ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి


