రైతులకు మార్కెట్ భరోసా కల్పించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యాన మిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఉద్యాన మిషన్పై మంగళవారం సాయత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల్లో కూరగాయలు విక్రయించేందుకు అవుట్లెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ తర్వాత దశలో విశాఖపట్నంకు పంపించి విక్రయించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రబీలో అదనంగా 3,300 ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటలు సాగుచేసినట్టు వెల్లడించారు. ఆకుకూరలు, కూరగాయాలు, కోకో, బొప్పాయి లాంటి పంటలతో పాటు 30 ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిట్టిబాబు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయండి
విజయనగరం కలెక్టరేట్: జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతికి కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఇంజినీరింగ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గృహ నిర్మాణ ఏఈలు క్షేత్ర స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీమోహన్ పాల్గొన్నారు.


