కొత్త ఏడాది తీరు మారేనా?
విజయనగరం అర్బన్/రామభద్రపురం:
విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చింది. మరో మూడు నెలల్లో ముగియనుంది. ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో సమస్యలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. విద్యార్థుల ‘సంక్షేమం’ అందని ద్రాక్షగానే మిగిలింది. ‘తల్లికి వందనం’ అందక విద్యార్థుల తల్లిదండ్రులు వినతులు పట్టుకుని ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు డిజిటల్ విద్య అటకెక్కింది. నాణ్యతలేని విద్యాకానుకలతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. పాఠ్యపుస్తకాలు సైతం పూర్తిస్థాయిలో అందని దుస్థితి. వందరోజుల విద్యాప్రణాళిక అమలులో లోపాలు విద్యార్థులకు శాపంగామారాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో జాప్యం ప్రభావం విద్యాబోధనపై చూపుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యంచేస్తోందని, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులకు ప్రాధాన్యం తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● పనులు పూర్తయ్యేనా?
గత ప్రభుత్వం తలపెట్టిన నాడు–నేడు పథకం రెండో విడత నిర్మాణాలకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 737 విద్యాసంస్థల్లో 60 శాతం మేర పనులు పూర్తయిన నిర్మాణాలు ఇప్పుడు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. నాడు–నేడు పనుల పేరు ‘మన బడి మన భవిష్యత్తు’గా పేరు మార్చడమే తప్ప నిధుల విడుదల, పనుల నిర్వహణ వంటివి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● డిజిటల్ విద్య గాలికి...
పాఠ్యాంశాల బోధనకు సాంకేతికత జోడించి మరింత నాణ్యతను పెంచేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ విద్య తొలి ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం వేల కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలల స్మార్ట్ టీవీలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఐఎఫ్పీ (ఇంట్రేక్టివ్ ఫ్లాట్ పానెల్)లు మరమ్మతులకు గురైతే పట్టించుకోకపోవడం వల్ల అవి మూలకు చేరాయి. డిజిటల్ విద్యకు దోహదం చేసే 8వ తరగతి విద్యార్ధుల ట్యాబ్లు పంపిణీ చేయకుండా వాటి వినియోగాన్ని దూరం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక వ్యవస్థను దూరం చేసి కార్పొరేటు విద్యారంగంపై మమకారం చూపుతోందనే విమర్శలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి.
● టీడీపీ ప్రభుత్వం తొలిఏడాది తల్లికివందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది జిల్లాలో కేవలం 60 శాతం మందికి మాత్రమే పథకం వర్తింప చేసి చేతులు దులుపుకుంది. అర్హులందరికీ వర్తింప చేయకపోవడమే కాకుండా భారీగా నిధుల్లో కోత విధించింది. ప్రకటించిన మేరకు రూ.15 వేలు తల్లుల ఖాతాల్లో వేయాల్సి ఉండగా చాలామందికి రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.11 వేలు చొప్పున మాత్రమే వేసింది. వీరంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తోంది.
● టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన పలు రకాల హామీలుకూడా నెరవేర్చలేదు. గతేడాది జూలైలో చేపట్టిన బదిలీల్లో జరిగిన లోపాలను ఇప్పటివరకు సరిచేయలేదు. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసినా ఇప్పటివరకు నూతన కమిటీని వేయలేదు. దీనిపై ఎన్నోసార్లు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేసినా ఫలితం లేదు.
● జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16,287 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. గతంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా పరిషత్ నిధులు కేటాయించి స్టడీ మెటీరియల్ అందించేవారు. ఈ ఏడాది చంద్రబాబు సర్కారు నిధులు కేటాయించకపోవడంతో ఎస్సీఈఆర్టీ సిద్ధంచేసిన మోడల్ పేపర్లే దిక్కయ్యాయి. ఆ పేపర్లు కూడా సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఒక్కోస్కూల్కు ఒక్కోసెట్ మోడల్ పేపర్లు మాత్రమే అందజేసింది. ఎస్సీఈఆర్టీ ఇచ్చిన మోడల్ పేపర్లే దిక్కంటూ విద్యార్థులు సొంత డబ్బులతో జెరాక్సులు తీసుకుని చదువుసాగిస్తున్నారు.
ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం
విద్యాసంవత్సరం ముగుస్తున్నా అందని తల్లికి వందనం
గాలికి వదిలేసిన డిజిటల్ విద్య
టీచర్లకు ఇచ్చిన హామీల అమలూ
అంతే..
లోపభూయిష్టంగా వంద రోజుల ప్రణాళిక అమలు
కొత్త ఏడాది తీరు మారేనా?
కొత్త ఏడాది తీరు మారేనా?
కొత్త ఏడాది తీరు మారేనా?


