రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. ఈనెల 22,23 తేదీల్లో విశాఖలో జరిగిన సబ్జూనియర్స్, జూనియర్స్ పోటీల్లో గౌడ సాకేత్ 50 మీటర్స్ బ్రీస్ట్ స్ట్రోక్, 100 మీటర్స్ బట్టర్ ఫ్లై, 50 మీటర్స్ ఫ్రీ స్టైల్,100 మీటర్స్ ఫ్రీ స్టైల్లో నాలుగు గోల్డ్ మెడల్స్తో పాటు 100 మీటర్స్ బ్రీస్ట్ స్ట్రోక్ లో సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నాడు. అంతేకాకుండా మరో స్విమ్మర్ లెంక గుణవంత్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్, 100 మీటర్స్ ఫ్రీ స్టైల్లలో రెండు గోల్డ్ మెడల్స్, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్లో ఒక సిల్వర్ మెడల్, 50 మీటర్స్ బట్టర్ ఫ్లై , 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో బ్రాంజ్ మెడల్స్ చేజిక్కించుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావు, స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.ఆదిలింగం, కోచ్ శ్రీను అభినందించారు. ఈ ఇద్దరు క్రీడాకారులు డిసెంబర్లో హైదరాబాద్లో జరగబోయే సౌత్ జోన్ జాతీయ పోటీలకు హాజరుకానున్నారని తెలియజేశారు.
● సెమీ క్రిస్మస్లో పాల్గొన్న రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల పాస్టర్లు
విజయనగరం టౌన్: సౌతిండియా బాప్టిస్ట్ చర్చెస్ పదో వార్షికోత్సవాన్ని స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని దైవసందేశాన్ని అందజేశారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త రాయబారులతో సమావేశం నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ డీజే.నిరంజన్బాబు (హనుమకొండ), డాక్టర్ బొంత శామ్యూల్సన్ (హైదరాబాద్) తదితరులు దైవసందేశం ఇచ్చారు. సాయంత్రం విలియం కేరీ డయాస్ వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ ఎం.రామయ్య (బెంగళూర్) కేక్ కటింగ్ చేశారు. రెవరెండ్ డాక్టర్ ఎస్.ప్రకాష్రాజ్ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రీస్తు సోదరులు పాల్గొన్నారు.
డీడీ కేసుల్లో 25 మందికి జరిమానా
● ఇద్దరికి జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి బైక్లు నడుపుతున్న 25 మంది నిందితులకు రూ.10వేలు చొప్పున జరిమానా, ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్ ఆర్ తేజచక్రవర్తి, శ్రీవిద్యలు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 18 మంది పట్టుబడటంతో కేసులు నమోదు చేసి ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి వద్ద హాజరు పరచగా అందులో 17 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున ,మరో నిందితుడికి 5 రోజుల జైలుశిక్ష విధించారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా 9 మంది పట్టుబడటంతో వారిపై కేసులు నమో దు చేసి ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ విద్య వద్ద హాజ రుపరచగా 8 మందికి రూ.10వేలు చొప్పున జరిమానా, మరో వ్యక్తికి 5 రోజుల జైలుశిక్ష విఽధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ వివరించారు.
వృద్ధుడి హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవం
పార్వతీపురం రూరల్: పాత కక్షల నేపథ్యంలో ఓ వృద్ధుడిని హత్య చేసిన కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి మంగళవారం మాట్లాడుతూ ముద్దాయికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురంలోని గాంధీ సత్రానికి చెందిన లంకకృష్ణ(33) 2019లో స్థానికుడైన సంబాన ఆదినారాయణ (58)ను హతమార్చాడు. పోలీసుల దర్యాప్తులో నేరం రుజువు కావడంతో జిల్లా రెండో అదనపు జడ్జి ఎస్.దామోదరరావు ముద్దాయికి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.1,400 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలియజేశారు. పకడ్బందీగా ఆధారాలు సమర్పించి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీలు, పోలీసు అధికారులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు


