
ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధి సాధ్యం
విజయనగరం అర్బన్: ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చెందుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి అధికారి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. వ్యవసాయంలో కొత్త ఆలోచనలు, ప్రయోగాలు అమలుచేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ డా.అహ్మద్బాబు, జిల్లా అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వద్ధి రేటు సాధనకు ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పండించే పంటలు, కూరగాయలు, పూలు ఇతర ఉద్యాన ఉత్పత్తులకు విశాఖలో మంచి మార్కెట్ ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. అహ్మద్ బాబు మాట్లాడుతూ వృద్ధిరేటు సాధనలో కిందిస్థాయి సిబ్బందిని భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్తో జాతీయవాష్ నిపుణుల భేటీ
విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత ఆధ్వర్యంలో జాతీయ వాష్ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) నిపుణులు సుధీర్కుమార్ బండారీ, సౌమేంద్ర రంజన్ గంగూలి శనివారం భేటీ అయ్యారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను కలెక్టర్కు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. డీఈలు ఢిల్లీశ్వరరావు, యడ్ల గోవిందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.