
ఎముకల విభాగం వైద్యుడికి మెమో జారీ
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులను సొంత క్లినిక్లకు తరలిస్తున్నారనే ఆరోపణలపై ‘మా క్లినిక్కు వచ్చే యండి..!’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 15వ తేదీన ప్రచురితమైన కథనానికి సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. రోగిని తన క్లినిక్కు రమ్మని చీటీరాసి ఇచ్చిన వైద్యుడికి మెమో జారీ చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు తెలిపారు.
డీపీఎంఓగా రవికుమార్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: డిస్ట్రిక్ ప్రొగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ ఎం.ఎం.రవికుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీపీఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ ఎం. సూర్యనారాయణ స్థానంలో రవికుమార్ రెడ్డిని నియమించారు.
19న వాష్ కేంద్ర బృందం సందర్శన
బాడంగి: వాటర్ అండ్ శానిటేషన్, హైజనిక్ (వాష్) కేంద్ర బృందం ఈ నెల 19న బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించనున్నట్టు ఎంపీడీఓ ఎస్.రామకృష్ణ, గ్రామీణ రక్షితనీటి సరఫరా విభాగం ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, జల్జీవన్మిషన్ పనులను పరిశీలిస్తుందన్నారు. ఇందులో భాగంగా గ్రామాన్ని గురువారం పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఢిల్ల్శ్వేరరావు, పంచాయతీ విస్తరణాధికారి సూర్యనారాయణ, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు పాలవలస గౌరు, తదితరులు పాల్గొన్నారు.
అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి విజయనగరానికి చెందిన శివప్రసాద్ గురువారం రూ. లక్షా116లు విరాళం అందజేశారు. దేవస్థానం తరఫున దాతకు స్వామివారి అన్నప్రసాద విభాగం ఏఈఓ పిళ్లా శ్రీనివాసరావు బాండ్ అందించారు. అనంతరం అధికారులు స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదం అందజేశారు.
దరఖాస్తు స్థితిని ఓటర్లు తెలుసుకోవచ్చు
● డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి
విజయనగరం అర్బన్: ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లైమ్లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. సీఈఓఆంధ్రా.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో వివరాలు ఉంటాయని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్ఓ తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలో వచ్చిన క్లైమ్లు, వాటి స్థితిగతులను వివరించారు. జిల్లాలో సవరణ అనంతరం జనవరి 6న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం 15,68,048 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఎన్నికల సూపరింటిండెంట్ భాస్కరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు, అప్పారావు, సోములు, తదితరులు పాల్గొన్నారు.

ఎముకల విభాగం వైద్యుడికి మెమో జారీ

ఎముకల విభాగం వైద్యుడికి మెమో జారీ