విజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బాబామెట్టలోని సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి ఖాదర్బాబా సూఫీ క్షేత్రంలో ఆలయ ధర్మకర్త ఖలీల్బాబు సారథ్యంలో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. విశాఖ నుంచి హాజరైన రవిచంద్ర రవి, ఖలీల్బాబు తనయుడు అహ్మద్బాబుతో కలిసి ఉపవాస దీక్షాపరులకు ఆత్మీయతతో వడ్డన చేశారు. అనంతరం పరిసర ప్రాంత ప్రజలు, భక్తులకు ఖాదర్బాబా వారి అన్న సమారాధనను నిర్వహించారు.
నూనె గింజల పంటల సాగు పెంచాలి
విజయనగరం ఫోర్ట్: నూనె గింజల పంటలైన నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం సేద్య విభాగ అధిపతి డాక్టర్ ఎం.భరతలక్ష్మి అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ అధికారులకు, విస్తరణ అధికారులకు, వీఏఏలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూనె గింజల పంటల్లో కలుపు నివారణకు మార్కెట్లో కలుపు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వేరుశనగ పంటలో కదిరి లేపాక్షి, నిత్య వారిత వంటి రకాలను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ యు.త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
రెన్యువల్స్ సకాలంలో చేయించుకోవాలి
విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్స్ సకాలంలో రెన్యువల్స్ చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల వైద్యులకు కెపాసిటి బిల్డింగ్, జనరల్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ వెల్లడించకూడదన్నారు. సమావేశంలో అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.రాణి, పీసీపీఎన్డీటీ నోడల్ అధికారి డాక్టర్ రెడ్డి అచ్చుతకుమారి, డాక్టర్ ఎం.జయచంద్రనాయుడు, డెమో వి.చిన్నతల్లి, డిప్యూటీ డెమో ఎస్.రమణ పాల్గొన్నారు.
మారిక హెచ్ఎం సస్పెన్షన్
వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు గిరి శిఖరంపై ఉన్న మారిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ శ్రీకాంత్ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని అందిన ఫిర్యాదుల మేరకు ఎంఈఓతో విచారణ నిర్వహించారు. అనంతరం సస్పెండ్ చేస్తూ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. సదరు హెచ్ఎం స్థానంలో వేరొకరిని నియమించాలని ఎంఈఓకు సూచించారు.
దర్బార్లో ఇఫ్తార్ విందు
దర్బార్లో ఇఫ్తార్ విందు