జన సమీకరణ కోసం 70 శాతం బస్సుల తరలింపు
బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాసిన విద్యార్థులు, కార్మికులు
కిక్కిరిసిన బస్సులు.. ఫుట్బోర్డులపై ప్రమాదకర ప్రయాణాలు
ఇదే అదునుగా ప్రయాణికులను దోచుకున్న ఆటోవాలాలు
ప్రత్యామ్నాయం ఏదీ?.. నెలలో ఇది రెండోసారి అంటూ ప్రజల ఆగ్రహం
ఫుట్పాత్పై
ప్రమాదకర ప్రయాణం
డాబాగార్డెన్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలో నిర్వహించిన కార్యక్రమాలకు భారీగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో సామాన్య ప్రయాణికులు నరకం చూశారు. జన సమీకరణ కోసం జిల్లాలోని వివిధ డిపోల నుంచి దాదాపు 70 శాతం బస్సులను సీఎం సభకు మళ్లించడంతో ప్రజా రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
గంటల తరబడి నిరీక్షణ.. కిక్కిరిసిన ప్రయాణం
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులతో పాటు డాక్యార్డ్, సింధియా, నేవీ తదితర సంస్థలకు వెళ్లే ఉద్యోగులు బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎప్పుడో ఒకసారి వచ్చిన కొద్దిపాటి బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఫుట్బోర్డులపై ప్రమాదకరంగా గమ్యస్థానాలకు చేరారు. బస్సులు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు పాసులున్నా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఉద్యోగులు వాపోయారు. మరోవైపు సీఎం సభకు వెళ్లిన కొన్ని బస్సులు కేవలం 10, 15 మందితోనే ఖాళీగా దర్శనమివ్వడం పట్ల ప్రజలు మండిపడ్డారు.
నిలువునా దోచేసిన ఆటోవాలాలు
బస్సులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేశారు. ముంబై, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి విశాఖ రైల్వే స్టేషన్లో దిగిన ప్రయాణికులు.. గమ్యస్థానాలకు చేరేందుకు బస్సులు లేక గందరగోళానికి గురయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిమాండ్ చేసినంత చెల్లించి ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది.
నెలలో ఇది రెండోసారి
రాజకీయ సభల కోసం బస్సులను మళ్లించి సామాన్యులను ఇబ్బంది పెట్టడం షరా మామూలుగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలోనే పాయకరావుపేటలో జరిగిన జలహారతి కార్యక్రమానికి, గత నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సైతం వందలాది బస్సులను తరలించారు. ప్రతిసారీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం తమను రోడ్డున పడేస్తోందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సభల కోసం ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


