సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహా నగర ఎన్నికల నగారా మోగకముందే జనసేన శిబిరంలో నైరాశ్యం అలుముకుంది. విశాఖ రాజకీయాల్లో తమదే పైచే యి కావాలని.. పెరిగిన వార్డుల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న స్థానిక నేతల ఆశలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన తాజా వ్యాఖ్యలు నీళ్లు చల్లాయి. వంద శాతం స్ట్రైక్ రేట్తో అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న తపనతో ఉన్న నేతలకు నాదెండ్ల మాటలు గాలి మొత్తం తీసేశాయి.
నాదెండ్ల ఏమన్నారంటే..
విశాఖలో శనివారం నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘మనం గెలిచే సీట్లే తీసుకుంటాం. 100 శాతం స్ట్రైక్ రేట్ వచ్చేటట్టే మనం కష్టపడదాం. దానికోసం నిలబడదాం. అంతేగానీ తొందరపడి మనకి ఒత్తిళ్లు వచ్చాయి కాబట్టి, సంఖ్య పెంచేసుకుని మాకొక 60 ఇవ్వండి, 70 ఇవ్వండి, 120కి 120 స్థానాల్లో పోటీ చేస్తాం అనే ఆలోచనను మీరెవరూ కూడా తెచ్చుకోవద్దు. ఇదొక బాధ్యత కలిగిన పొలిటికల్ పార్టీ. రెస్పాన్సిబుల్గా ఉందాం. ఏ ఎలక్షన్ అయినా ఎలక్షన్గానే చేయాలి. ఆషామాషీగా చేయకూడదు’ అన్న మాటలతో విశాఖ జనసేనలో నైరాశ్యం అలముకుంది.
వార్డులు పెరిగినా.. భిక్ష కోసమేనా!
జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెరగనుండటంతో విశాఖ జనసేన శ్రేణులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి ఎలాగైనా 120కి 120 సీట్లులోనూ పోటీ చేసే అవకాశం ఉందని.. తమకు టికెట్ వస్తుందని ద్వితీయ శ్రేణి నేతలు, ఆశావహులు పావులు కదపడం మొదలుపెట్టారు. డబ్బు ఖర్చు పెట్టి మరీ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతో హడావుడి చేశారు. అయితే, నాదెండ్ల తాజా వ్యాఖ్యలు ఈ ఉత్సాహానికి బ్రేకులు వేశాయి. పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్లలోనే బరిలోకి దిగనున్నామని స్పష్టం చేసేశారు.
ఈ నేపథ్యంలో ‘టీడీపీ భిక్షగా ఇచ్చే సీట్లకే పరిమితం కాబోతున్నామా’ అని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పి ఇష్టమొచ్చినట్టు సీట్లు అడగబోమని నాదెండ్ల ఫుల్ క్లారిటీతో కూడిన వార్నింగ్ ఇవ్వడం స్థానిక నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. జీవీఎంసీ బరిలో జనసేన పాత్ర ఎంతవరకూ పరిమితం కానుందనే ఆందోళన వారిలో మొదలైంది.


