నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
యువ మహిళా నేతకు పగ్గాలు అప్పగించిన జగన్
నియోజకవర్గ క్యాడర్లో సరికొత్త జోష్
సాక్షి, విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలిలో విపక్ష నేత, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటివరకు సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడిన నేపథ్యంలో భీమిలి బాధ్యతలను అనూషకు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతలను ఆమె భుజానకెత్తుకోవడంతో క్షేత్రస్థాయి కేడర్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది.
క్రియాశీల రాజకీయాల్లోకి..
బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఈ నియామకంతో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకై న పాత్రకు సిద్ధమవుతున్న అనూషకు భీమిలి బాధ్యతలు కీలకమైనవిగా మారాయి. 2024 ఎన్నికల అనంతరం తండ్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో ఆమె మమేకమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవడం ద్వారా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నట్లు పేర్కొంటున్నాయి. ఇప్పుడు భీమిలి బాధ్యతలు చేపట్టడంతో ఆ అనుభవాన్ని కొత్త నియోజకవర్గంలో వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఆమె ముందున్న తక్షణ బాధ్యతలుగా మారాయి.
వైద్య సేవ నుంచి ప్రజా క్షేత్రంలోకి..
డాక్టర్ అనూష కేవలం రాజకీయ వారసురాలు మాత్రమే కాదు.. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నిబద్ధత గల యువ నేత. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల డైరెక్టర్గా అందించిన వైద్య, సామాజిక సేవలు ప్రజల్లో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఉన్నత విద్య, వైద్య నేపథ్యం, ప్రజల సమస్యలపై స్పష్టమైన పట్టు, ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్న యువ నాయకురాలు భీమిలి బాధ్యతలు స్వీకరించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భీమిలిలో 2029లోపార్టీ జెండా ఎగరేస్తా..
బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు అనూష ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. తనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేయడమే తన లక్ష్యమని అనూష ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటి నుంచే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్కు అనూష కృతజ్ఞతలు తెలిపారు.


