20వ వార్డులో యాదవుల ఆగ్రహం
బీచ్రోడ్డు: నగరంలో పశువుల మాయంపై జీవీఎంసీ సిబ్బందిపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జీవీఎంసీ 20వ వార్డు పరిధిలో గత ఆరు నెలల్లో 15కు పైగా ఆవులు, గేదెలు కనిపించకుండా పోయాయని యాదవ కులస్తులు ఆరోపించారు. జీవనాధారమైన పశువులు మాయమవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితం ఒమ్మి కాశీకి చెందిన రెండు గేదెలు మాయమవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో జీవీఎంసీ పశువుల తరలింపు వాహన డ్రైవర్ గేదెలను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని బాధితులు తెలిపారు. అధికారిక అనుమతులు లేకుండానే తరలింపు జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్పై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని, రెండు నెలల పాటు సస్పెన్షన్కు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. ఈ దందా వెనుక మరికొందరు సిబ్బంది, దళారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం 30 మందికి పైగా యాదవ కులస్తులు మూడో పట్టణ నేర విభాగ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారాలు, గత ఫిర్యాదుల వివరాలను అందించారు. కేసు నమోదు చేసి, పశువులను తిరిగి ఇప్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జీవీఎంసీ కమిషనర్ స్వయంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


