బీచ్రోడ్డులో గ్రీన్ వాకథాన్..
జీవీఎంసీలో వర్క్షాప్
మహారాణిపేట: స్వచ్ఛమైన వాయువు అందరికీ అందాలంటే కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డా. పి.కృష్ణయ్య పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3 కోట్లతో వాయు నాణ్యతను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘స్వచ్ఛ వాయువు–నీలాకాశం కోసం స్వచ్ఛమైన గాలి’ కార్యక్రమంలో భాగంగా ఏపీపీసీబీ, జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం బీచ్రోడ్డులో గ్రీన్ వాకథాన్ నిర్వహించారు. వీపీఏ చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోర్టు వైస్ చైర్పర్సన్ రోషణి అపరంజితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జెన్ జీ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా మాట్లాడుతూ పోర్టు పరిధిలో మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతున్నామన్నారు.
వాయు కాలుష్యంపై వర్క్షాప్
స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా జీవీఎంసీ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకుని పరిశ్రమలు ముందుకు సాగడం అభినందనీయమన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు జీవీఎంసీ ఆధునిక ఆటోమేటెడ్ సిగ్నలింగ్ వ్యవస్థను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ చెప్పారు.


