సింథియా: తీవ్రంగా గాయపడిన ఆరు అడుగుల నాగజెర్రికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన ఘటన మల్కాపురం సింథియా సమీపంలోని క్రాంతినగర్లో చోటుచేసుకుంది. జీవీఎంసీ 63వ వార్డు పరిధి క్రాంతినగర్లో దావీదు తన స్థలానికి ఇనుప కంచెతో వల ఏర్పాటు చేశాడు. అందులో నాగజెర్రిపాము చిక్కుకుని మెడ, నడుము భాగాల్లో తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న పామును గమనించిన స్థల యజమాని వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. నాగరాజు అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకుని, అనంతరం 40వ వార్డు పరిధిలోని హిందూస్థాన్ షిప్యార్డ్ కాలనీలో ఉన్న గాంధీగ్రామ్ పశువైద్యశాలకు తరలించారు. అక్కడ పశువైద్యాధికారి సీహెచ్. సునీల్కుమార్ సుమారు గంటన్నర పాటు శ్రమించి పాముకు శస్త్రచికిత్స చేశారు. గాయానికి ఆరు కుట్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పాము క్షేమంగా ఉందని డాక్టర్ సునీల్కుమార్ వెల్లడించారు. గాయం పూర్తిగా తగ్గిన అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతామని నాగరాజు తెలిపారు.


