పుట్టి పెరిగి..వైద్య పట్టా అందుకున్నది
అందాల విశాఖలోనే..
అమెరికాలో అందాల పోటీల్లో
నెగ్గడం మరిచిపోలేని సంతోషం
నా పిల్లలకు నేనే రోల్ మోడల్
మిసెస్ ఇండియన్ అమెరికా
డాక్టర్ మాలినీ దాసరి
పెందుర్తి: ‘నేను పుట్టి పెరిగింది అందాల విశాఖలోనే. ఎంతో ఇష్టంగా చదివి గౌరవప్రదమైన వైద్య పట్టా అందుకున్నదీ ఇక్కడే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ప్రకృతిని ప్రేమించి, పరిరక్షించాలి. మొక్కలే మానవాళికి భవిష్యత్ను అందిస్తాయి’ అని మిసెస్ ఇండియన్ అమెరికా–2024 విజేత, వైద్యురాలు డాక్టర్ మాలినీ దాసరి అన్నారు. పెందుర్తి మండలం పెదగాడి సమీపంలోని సంకల్ప కళా గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించి ఆసక్తి కనబరిచారు. సహజ సిద్ధమైన రంగులతో అద్దకం వేసి రూపొందిస్తున్న వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు. ఎద్దు గానుగతో తయారు చేస్తున్న విధానాన్ని ఆసక్తిగా గమనించారు. లక్క బొమ్మలను చూసి మురిసిపోయారు.
ప్రకృతి సిద్ధంగా పండించిన దినుసులతో తయారు చేసిన పిండి వంటలను రుచి చూసి ప్రశంసిం చారు. సంప్రదాయ పద్ధతుల్లో విత్తనాలు చల్లడం, పప్పు ధాన్యాలను దంచడం వంటి గ్రామీణ జీవన విధానాలను ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల మొక్కలు, వాటి శాసీ్త్రయ నామాలు, ఔషధ ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కట్టెల పొయ్యిపై స్వయంగా వంట చేసి సందడి చేశారు. నర్సరీలోని మొక్కలను పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాలినీ దాసరి మాట్లాడుతూ సహజసిద్ధంగా పండించిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. మంచి, చెడులు మనం చూసే విధానంలోనే ఉంటాయని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతూనే తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టినట్లు తెలిపారు.
ఫ్యాకల్టీ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెంటర్షిప్, హనరరీ అవుట్స్టాండింగ్ మెచ్యూర్ గర్ల్ హూ ఇన్స్పైర్, హనరీ షేడ్స్ ఆఫ్ సక్సెస్, మిసెస్ తెలుగు యూఎస్ఏ–2025, మిసెస్ ఇండియా వరల్డ్–2025, మిసెస్ ఇండియా అమెరికా–2024, మిసెస్ లూసియానా యూనివర్స్–2024 వంటి అవార్డులు అందుకున్నట్లు వివరించారు. ‘నా పిల్లలకు నేనే రోల్ మోడల్’ అని పేర్కొన్న ఆమె, తాను సాధించిన విజయాల్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలన్నదే తన సంకల్పమని తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ కై ్లమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, డాక్టర్ మాలినీ దాసరి తల్లి లక్ష్మీకుమారి, కుమార్తెలు సమైక్య, సమైన, సంకల్ప ఆర్ట్ ప్రతినిధులు ఆకుల చలపతిరావు, పార్వతి, జెమిల్యా తదితరులు పాల్గొన్నారు.


