మహారాణిపేట: స్టైఫండ్ పెంపు డిమాండ్తో ఆరు రోజులుగా సాధారణ విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులు, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. సోమవారం నుంచి కేజీహెచ్తోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. జూనియర్ వైద్యుల నిర్ణయంతో ప్రభుత్వం అప్రమత్త మైంది. ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి వీరపాండెయన్, డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వైద్యులకు అన్ని రకాల సెలవులు రద్దు చేసి, ఆంధ్రా మెడికల్ కాలేజీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి మొత్తం 55 మంది వైద్యులను రప్పించి ఓపీలు, వార్డుల్లో సేవలకు ఏర్పాటు చేసినట్టు ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర నాయుడు తెలిపారు. ఆగస్టు 15 సెలవు, ఆదివారం అధికారిక సెలవుతో పాటు జూనియర్ వైద్యుల సమ్మె కలిసిరావడంతో కేజీహెచ్లోని పలు వార్డుల్లో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. వైద్య సేవలు అందించే వారు కరవై, నర్సులే వైద్యుల అవతారమెత్తి సేవలు అందిస్తున్నారు. పలు వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
హామీల అమలు, హక్కుల పరిరక్షణ కోసమే న్యాయమైన పోరాటం చేస్తున్నామని ఏపీజేయూడీఏ నాయకులు దినకర్ సాయి శ్రీనివాస్, కె.రవీంద్ర, డాక్టర్ శిరాజ్ తెలిపారు. జీవీంఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారం ఆరో రోజుకున్నాయి. పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.


