భీమిలి పరిధిలో పాత భవన పునర్నిర్మాణం,
క్రిమినల్ కాంప్లెక్స్, లిఫ్ట్ తదితర అంశాలపై చర్చ
విశాఖ లీగల్: విశాఖ కోర్టు ప్రాంగణంలో మౌలిక వసతులు కల్పించాలని, న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, కార్యదర్శి సుధాకర్ కోరారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్లను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భీమునిపట్నం కేసులకు సంబంధించిన ప్రాదేశిక న్యాయ పరిధి, పాత కోర్టు భవనం, క్రిమినల్ కాంప్లెక్స్ ఏర్పాటు, లిఫ్ట్ సౌకర్యం, కోర్టు ప్రాంగణంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు తదితర సమస్యలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులు ప్రస్తావించిన అంశాలను న్యాయమూర్తులు సావధానంగా విని, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో విశాఖపట్నం బార్ అసోసియేషన్ను సందర్శించి, సమస్యలను స్వయంగా పరిశీలించడంతోపాటు న్యాయవాదులతో చర్చిస్తానని పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ హామీ ఇచ్చినట్లు అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు తెలిపారు. ఈ భేటీతో విశాఖపట్నం కోర్టు ప్రాంగణంలోని మౌలిక వసతుల కల్పన, న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురించాయని బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


