వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ మహిళలు, పిల్లలను వేధించే వారికి త్వరగా శిక్ష పడేలా గత ప్రభుత్వం దిశా బిల్లు తీసుకొచ్చిందని, 21 రోజుల్లో శిక్ష పడేలా తీసుకొచ్చిన మార్పును హోంమంత్రి అనిత తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళా రక్షణ కోసం జగనన్న అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపారని, అది కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు. సందేహాలు ఉంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసి కేంద్రానికి పంపాలన్నారు. జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నామని, పేరు మార్చినా దిశ చట్టాన్ని కొనసాగించి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. బీఎన్ఎస్ చట్టాలు కూడా సరిగా అమలు కావడం లేదని, మహిళల రక్షణలో పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యమైందని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. పోలీసులను రెడ్బుక్ రాజ్యాంగం కోసమే వాడుతున్నారని, ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టడానికే చూస్తున్నారని ఆరోపించారు. మంత్రితో సహా వార్డు స్థాయి నాయకుల వరకు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.


