విశాఖ లీగల్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీజా గిల్ను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. సిరిపురపు కృష్ణమోహన్ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాది మృతి చెందిన సందర్భాల్లో సంతాప సభను గతంలో మాదిరిగానే ఉదయం 10.30 గంటలకు నిర్వహించేలా హైకోర్టు ఉత్తర్వులను సవరించాలని కోరారు. ప్రస్తుతం సంతాప కార్యక్రమాన్ని సాయంత్రం 4.15 గంటలకు నిర్వహిస్తున్నందున అప్పటికే చాలా మంది న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు కోర్టు ప్రాంగణం విడిచి వెళ్లిపోతున్నారని, దీంతో సంతాప కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో హాజరు ఉండడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించినట్లు కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు కె. రామ జోగేశ్వరరావు (మురళి), బి.వి.ఆర్. మూర్తి, డి. మంజులత, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.


