బీచ్రోడ్డు: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు సాగించిన ఉద్యమ విజయానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ పేర్కొన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు నిరసనగా, ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థులకు నివాళులర్పిస్తూ శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నల్ల కండువాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ విద్యార్థుల ఐక్య పోరాటం కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించిందని, యువత సంకల్పానికి ఇదే నిదర్శనమన్నారు. నీట్ పరీక్షల వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులు, యువతను ఆయన అభినందించారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను, ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, జిల్లా మున్సిపల్ విభాగం ప్రెసిడెంట్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు బిపిన్ జైన్, చెన్నా జానకిరామ్, వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వరరెడ్డి, పీతల వాసు, దస్మాంతుల మాణిక్యాల రావు, దొడ్డి బాపు ఆనంద్, ముత్తబత్తుల రమేష్, ఆలుపున కనకరెడ్డి, మహమ్మద్ షకిల్, గురజారపు రవి, ముజీబ్ ఖాన్, కోడిగుడ్ల శ్రీధర్, పచ్చిపల్లి రాము, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు,జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు, జిల్లా సెక్రటరీ అభిరెడ్డి ఆది విష్ణు, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


