డాబాగార్డెన్స్: లోకో రన్నింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్(ఏఐఎల్ఆర్ఎస్ఏ) సౌత్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో తొలి జోనల్ మహాసభ శుక్రవారం నిర్వహించారు. లోకో రన్నింగ్ సిబ్బంది పని పరిస్థితులు, భద్రత, సిబ్బంది కొరత, సంక్షేమం, బదిలీలు, పెన్షన్ తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. సిటు రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ విభజన హామీలతో ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు పూర్తి స్థాయి వనరులు కల్పించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణలో సంఘాల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. 1974లో ఎల్ఆర్ఎస్ యూనియన్ దేశంలోని సంఘాలను ఐక్యం చేసి, సమ్మెలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఏఐఎల్ఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి జేమ్స్ మాట్లాడుతూ లోకో రన్నింగ్ సిబ్బందిపై పెరుగుతున్న పని ఒత్తిడి ఉద్యోగుల ఆరోగ్యంతో పాటు రైల్వే భద్రతపై కూడా ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల ఉపసంహరణ, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, ఆర్ఏసీ–1980 సూత్రాల ప్రకారం రన్నింగ్ అలవెన్స్ సవరణ తదితర డిమాండ్లతో తీర్మానాలు చేశారు. జాతీయ అధ్యక్షుడు ఆర్.ఆర్.భగత్, పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, బి.జగన్, బీసీఎస్ రావు, బీవీఎస్వీ రాజు, డివిజన్ కార్యదర్శి ఎ.బోలోనాథ్, హరికృష్ణ, గణేష్, సంతోష్, వీవీఎల్ నరసింహులు పాల్గొన్నారు.


