అప్పన్న తొలిపావంచా వద్ద షాపుల తొలగింపులో ఉద్రిక్తత
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
చేసిన చిరు వ్యాపారి
బాధితులకు న్యాయం చేయాలని
కలెక్టర్ ఆదేశాలు
సింహాచలం: సింహాచలంలోని కొండదిగువ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం తొలిపావంచా వద్ద ఉన్న 13 దుకాణాలను దేవస్థానం అధికారులు తొలగించేందుకు ప్రయత్నించడంతో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. తమ జీవనాధారమైన దుకాణాలను తొలగించడం అన్యాయమని చిరు వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. తొలిపావంచా ప్రాంత అభివృద్ధి పేరుతో గతంలో తమ దుకాణాలను తొలగించి, ప్రత్యామ్నాయంగా ఆరేళ్ల క్రితం సమీపంలో 13 దుకాణాలు నిర్మించి కేటాయించారని తెలిపారు. అయితే ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేదన్నారు. అయినప్పటికీ అక్కడే వ్యాపారాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దుకాణాలను కూడా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఇటీవల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ను కలిసి తమ సమస్య వివరించినా ఫలితం లేకపోయిందని ఆక్షేపించారు. అయినప్పటికీ దేవస్థానం అధికారులు తొలగింపునకు పూనుకోవడం దారుణమని వాపోయారు. ఈ క్రమంలో చిరు వ్యాపారి సంపంగి వరంబాబు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వ్యాపారులతో మాట్లాడిన అనంతరం తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేసి, బాధితులకు న్యాయం చేయాలని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావును ఆదేశించారు.


