గోపాలపట్నం : ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరగనున్న జేఎన్టీయూ–గురజాడ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటారు ప్రమాద పరిహారం, మనీ రికవరీ, భూసేకరణ, కార్మిక, కుటుంబ, పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు.
విశాఖ డెయిరీ పాలు, పెరుగు ధరల పెంపు
అక్కిరెడ్డిపాలెం: విశాఖ డెయిరీ పాలు, పెరుగు ధరలను పెంచుతున్నట్లు డెయిరీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. 500 మి.లీ. ఫుల్ క్రీమ్ పాలు రూ.34 నుంచి రూ.36కు, లీటర్ పాలు రూ.68 నుంచి రూ.71కు పెరిగాయి. అలాగే 400 గ్రాముల పెరుగు రూ.32 నుంచి రూ.35కు, 425 గ్రాముల పెరుగు ప్యాకెట్ రూ.30 నుంచి రూ.32కు, కిలో బకెట్ పెరుగు ధర రూ.95 నుంచి రూ.100కు పెరిగినట్లు డెయిరీ యాజమాన్యం వెల్లడించింది. డెయిరీ నిర్వహణ వ్యయం భారీగా పెరగడం వల్లే పాల ఉత్పత్తులపై ధరలు పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం వివరించింది.


