సింహాచలం : ఉగాదిని పురస్కరించుకుని ఈనెల 19న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పెళ్లిరాట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ఆస్థానమండపంలో వేంజేపచేసి పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పంచాంగశ్రవణం, విశిష్ట అతిథిలకు పురస్కారాలు అందిస్తామన్నారు. సాయంత్రం 4గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోను, రాజగోపురం పక్కన, వార్షిక కల్యాణం నిర్వహించే ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న మైదానంలోను పెళ్లి రాటలు వేయడం జరుగుతుందన్నారు. ఆరోజు సాయంత్రం సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ని తాకే వీలు ఉంటుందని పేర్కొన్నారు.


