
దివ్యాంగుల పింఛన్లపై కక్ష
రీ వెరిఫికేషన్ పేరుతో
భారీగా పింఛన్ల ఏరివేత
40 శాతంలోపు ఉన్న వారికి నోటీసులు
జిల్లాలో 1178 మందికి పింఛను నిలిపివేత
ఆందోళనలో దివ్యాంగులు
కూటమికి వ్యతిరేకంగా 25న ఆందోళన
మహారాణిపేట: ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పింఛనుదారులపై కూటమి సర్కార్ కక్ష కట్టింది. ఎలాగైనా దివ్యాంగుల పింఛన్లు తగ్గించడానికి ముమ్మరంగా ప్రయత్నలు చేస్తోంది. తాజాగా 40 శాతంలోపు ఉన్న దివ్యాంగ పింఛనుదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి వీరికి పింఛన్ నిలుపుదల చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్లు తీసుకునే లబ్దిదారుల సంఖ్యను తగ్గించడానికి ర్యాండమ్ సర్వే చేశారు.ఆ తర్వాత మంచం మీద ఉండే దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి ఇళ్లకు వెళ్లి సదరం సర్టిఫికెట్స్ రీ వెరిఫికేషన్ చేశారు. అలాగే ఇతర ప్రాంతాల వైద్యుల చేత సదరం సర్టిఫికెట్లను ఆస్పత్రుల్లో రీ వెరిఫికేషన్ చేస్తున్నారు.ఇప్పటి వరకు కంటి దివ్యాంగుల,ఈఎన్టీ దివ్యాంగులు,మానసిక దివ్యాంగులు సదరం సర్టిఫికేట్స్ రీ వెరిఫికేషన్ జరిగింది. ఇప్పుడు అర్ధోపెడిక్ దివ్యాంగుల సదరం సర్టిఫికేట్స్ రీ వెరిఫికేషన్ జరుగుతోంది.
దివ్యాంగుల ఆవేదన
ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడంపై దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఇబ్బందులతో బాధపడుతున్న తమకు, ఈ రీ–వెరిఫికేషన్ ప్రక్రియ మరింత భయాన్ని కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. రీ–వెరిఫికేషన్లో సర్టిఫికెట్లు రద్దైతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రూ.10,000 పింఛను పొందుతున్న దివ్యాంగులకు కూడా నోటీసులు జారీ చేయడంతో వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
25న దివ్యాంగులతో ర్యాలీ
జిల్లాలో 1178 మంది దివ్యాంగుల పింఛన్లు నిలిచిపోవడంతో ఈనెల 25న వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు తెలిపారు. సమావేశం అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటామని,అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని అప్పారావు వివరించారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని, పింఛన్లు రద్దు చేయడం అన్యాయని,దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని అప్పారావు కోరారు.
జిల్లాలో మొత్తం దివ్యాంగుల
పింఛనుదారులు : 21,306
రీ–వెరిఫికేషన్ పూర్తయినవారు : 16,187
రీ–వెరిఫికేషన్ చేయాల్సినవారు : 5,119
నోటీసులు అందుకున్నవారు : 1,178
జిల్లాలో 1,178 మందికి
నోటీసులు
జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. వీరిలో ఇప్పటివరకు 16,187 మందికి రీ–వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రక్రియలో 1,178 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల ప్రకారం 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు తేలింది. దీంతో వారికి పింఛన్లు నిలిపివేస్తున్నట్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు.

దివ్యాంగుల పింఛన్లపై కక్ష