
నేటి నుంచి చందనోత్సవం టికెట్ల విక్రయం
ఆన్లైన్లో కూడా అందుబాటులో...
సింహాచలం: ఈనెల 30న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రూ.300, రూ.1000 దర్శన టికెట్ల విక్రయాలు గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. సింహాచలం కొండపైన దేవస్థానం పాత పీఆర్వో కార్యాలయం వద్ద, నగరంలోని పలు బ్యాంకుల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుని ఆధార్ నెంబరుతో పూర్తిచేసి టికెట్లు నేరుగా పొందవచ్చన్నారు. సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ల్లోను, అక్కయ్యపాలెం, కేజీహెచ్, మహారాణిపేటలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ల్లో టికెట్లు లభిస్తాయని తెలిపారు. అలాగే బిర్లా జంక్షన్, సాలిగ్రామపురం(అక్కయ్యపాలెం) ఎస్బీఐ బ్రాంచ్ల్లో టికెట్లు లభిస్తాయని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు మాత్రమే టికెట్లు విక్రయాలు జరుగుతాయన్నారు. చందనోత్సవం రోజు ఎలాంటి దర్శన టికెట్ల విక్రయాలు జరగవని పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 7 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు www. aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా టికెట్లు పొందవచ్చని తెలిపారు.
అప్పన్న హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీల ఆదా యం గత 28 రోజులకుగాను రూ.1,81,41,219 వచ్చినట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. 145.100 గ్రాముల బంగారం, 11.250 కిలోల వెండి, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్టు తెలిపారు.