విశాఖ విద్య: విద్యా రంగంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వెనుకబడిన, నిరుపేద వర్గాలకు చదువులు భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఉన్న విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కూటమిలో కొంత మంది పెద్దల సహకారంతో కార్పొరేట్ శక్తులు నగరంలో విద్యా వ్యాపారానికి స్కెచ్ వేస్తున్నాయి. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ చదువులు సవ్యంగా సాగకపోవడంతో.. తమ పిల్లల భవిష్యత్ దృష్ట్యా చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు మోజు చూపిస్తున్నారు.
ఇదిగో సాక్ష్యం
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 1,387 పాఠశాలలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం 2024–25 విద్యా సంవత్సరంలో 3,81,262 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లు 610 ఉండగా వీటిలో 79,166 మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లు 777 ఉండగా, వీటిలో 3,02,096 మంది చదువుతున్నారు. 2023–24లో (వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు) ప్రైవేటు స్కూళ్లలో 2,98,330 మంది ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024–25లో గతం కంటే 3,766 మంది ఎక్కువగా చేరారు. ప్రభుత్వ స్కూళ్లు నుంచి విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోతున్నారనడానికి ఈ అంకెలే నిదర్శనం.
కార్పొరేట్కు మేలు చేసేలా స్కూళ్ల రేషనలైజేషన్
కూటమి ప్రభుత్వం 117 జీవో రద్దు పేరిట చేపట్టిన రేషనలైజేషన్తో జిల్లాలోని 31 ప్రాథమికోన్నత స్కూళ్లలో 20కు పైగానే ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్నాయి. దీంతో ఇప్పటి వరకు అక్కడ 6,7,8 తరగతులు చదివే విద్యార్థులను ఎగరేసుకుపోయేందుకు సమీపంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు వారి తల్లిదండ్రులతో మంతనాలు మొదలుపెట్టారు. అలాగే మోడల్ స్కూల్ పేరిట, ప్రైమరీ స్కూళ్లలో 3, 4, 5 తరగతులు తీసేస్తుండటంతో.. బస్సులు పెడతాం మా స్కూళ్లకు పంపించండి అంటూ ప్రైవేటు యాజమన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలతో 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలో మరింత మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సర్కారు చదువులపై సన్నగిల్లుతున్న ఆశలు
ఇంగ్లిష్ మీడియం చదువులకు మంగళం
కార్పొరేట్కు కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం
ప్రైవేట్ పాఠశాలలకు క్యూ కడుతున్న విద్యార్థులు
ఇదే అదునుగా ఫీజులు పెంచేస్తున్న యాజమాన్యాలు


