ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

ఆనందపురం: గండిగుండం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు. వివరాలివీ.. అనకాపల్లి జిల్లా తుమ్మపాలకు సమీపంలోని చినబాబు కాలనీకి చెందిన అయినవిల్లి వికాస్‌(19) దాకమర్రి వద్ద గల రఘు ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదట సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే తోటి స్నేహితులతో కలిసి ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాగా.. శనివారం తమ దగ్గర బంధువులు వివాహం ఉండడంతో ఇంటికి వస్తానని వికాస్‌.. తన తండ్రి నాగేశ్వరరావుకు ఫోన్‌ చేసి అడగ్గా సమ్మతించాడు. తాడేపల్లిగూడెంలో వ్యాపారులకు సరఫరా చేయడానికి విజయనగరంలో ఓ వ్యాపారి వద్ద తెలగపిండి కొనుగోలు చేసి బొలెరోలో లోడు చేసి ఉందని.. అక్కడకు వెళ్లి ఆ వ్యాన్‌లో అనకాపల్లికి రావాలని వికాస్‌కు తండ్రి సూచించాడు. ఈ మేరకు వికాస్‌ విజయనగరం వెళ్లి బొలెరోలో బయలుదేరాడు. ఆ వ్యాన్‌ అనకాపల్లి వైపు వెళ్తుండగా గండిగుండం వద్ద ఆగి ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌ కేబిన్‌లో కూర్చున్న వికాస్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ డ్రైవర్‌ తిలక్‌ కుమార్‌ ఎడమ కాలు విరిగి పోయింది. డ్రైవర్‌ తిలక్‌ను ఆనందపురం పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి.. వికాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top