స్వచ్ఛమైన నీటి సరఫరా లక్ష్యం
● మేయర్ హరి వెంకటకుమారి
డాబాగార్డెన్స్: నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడమే జీవీఎంసీ లక్ష్యమని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. శుక్రవారం టీఎస్ఆర్ కాంప్లెక్స్లోని తాగునీటి ట్యాంకులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ టెలీ కాన్ఫరెన్స్, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల్లో నగర ప్రజల నుంచి తాగునీటి సరఫరా విభాగంపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా రంగు మారిన, దుర్వాసన కూడిన నీరు సరఫరా అవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్లోని మంచినీటి ట్యాంకులను పరిశీలించామన్నారు. ప్రతి ట్యాంకును శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరుస్తున్న దృష్ట్యా శుక్ర, శనివారాల్లో జోన్–3, 4, 5 పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీరు సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజినీర్ శేఖర్, సహాయ ఇంజినీర్ విల్సన్, తదితరులు పాల్గొన్నారు.