● కొన్నాళ్లుగా క్రాంతి, శ్యామ్పై రగిలిపోతున్న ఎర్రయ్య ● కాకినాడలో జరిగిన ఫంక్షన్లో హత్యకు పథక రచన?
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదర్శనగర్లో గురువారం జరిగిన రౌడీషీటర్ క్రాంతి హత్య కేసులో పలు విషయాలు బయటకొస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 17న అదే ప్రాంతంలో జరిగిన అనిల్ హత్య కేసులో క్రాంతి కొడుకు శ్యామ్ ఏ1గా, ప్రస్తుతం క్రాంతిని హతమార్చినట్లు భావిస్తున్న ఎర్రయ్య ఏ3గా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనిల్ హత్య కేసులో తన ప్రమేయం లేకున్న క్రాంతి, అతని కొడుకు శ్యామ్ తనని అన్యాయంగా ఇరికించారంటూ కొంతకాలంగా ఎర్రయ్య రగిలిపోతున్నాడు. దీంతో పాటు తనకు బెయిల్ ఇప్పించకపోవడం, తర్వాత పట్టించుకోకపోవడంతో అతనికి ఆగ్రహం తెప్పించింది. కాగా.. కాకినాడలోని అనిల్ ఇంట్లో గురువారం జరిగిన ఫంక్షన్కు ఎర్రయ్య కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. అక్కడ అనిల్ హత్య విషయం ప్రస్తావనకు రావడంతో పాటు కొందరు ఈ కేసులో నిన్ను అన్యాయంగా ఇరికించారంటూ ఎర్రయ్యను రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో తండ్రీకొడుకులు క్రాంతి, శ్యామ్లపై కసి తీర్చుకోవాలని ఎర్రయ్య నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్న ఆయన నేరుగా ఆదర్శనగర్ వచ్చాడు. ఎర్రయ్య, అతని తండ్రి కలిసి అనుపమ బార్ సమీపంలో ఉండగా.. క్రాంతి అక్కడకు మద్యం సేవించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఎర్రయ్య.. కాంత్రిని సెల్తో వీడియో తీయడంతో అతను ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య అనిల్ హత్య ఘటన జరిగిన చోట వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎర్రయ్య తనతో తెచ్చుకున్న కత్తితో క్రాంతిని విచక్షణా రహితంగా పొడిచి హతమార్చినట్లు తెలిసింది. ఈ హఠాత్ పరిణామంతో ఎర్రయ్య తండ్రి అక్కడి నుంచి పరారు కాగా.. నిందితుడు పోలీసుల వద్ద లొంగిపోయినట్లు సమాచారం. అయితే ఈ అంశానికి సంబంధించి ఎంవీపీ పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.