షార్ట్‌సర్క్యూట్‌తో వైన్‌ షాపు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో వైన్‌ షాపు దగ్ధం

Sep 20 2026 7:36 AM | Updated on Sep 20 2026 7:36 AM

షార్ట్‌సర్క్యూట్‌తో వైన్‌ షాపు దగ్ధం రైతన్నల హై‘టెన్షన్‌’

కందుకూరు: షార్ట్‌సర్క్యూట్‌తో వైన్‌ షాపు దగ్ధమైంది. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జైభవాని వైన్స్‌లో శనివారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులోని మద్యంతో పాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మంటలు ఆర్పించారు. మద్యం, సామగ్రి కలిపి సుమారు రూ.1.30 కోట్ల మేర నష్టం వాటిల్లింది. షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

పొలాల నుంచి కరెంటు లైన్‌

వెళ్తోందని ఆందోళన

కొందుర్గు: ఇప్పటికే రేడియల్‌ రోడ్డుకు భూములు కోల్పోయిన రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం బాధితులకు ఒకే విడతలో ఎకరాకు రూ.40 లక్షలు పరిహారం ఇవ్వడంతో కాస్త కుదుటపడ్డారు. అంతలోనే ఇదే ప్రాంతం నుంచి హైటెన్షన్‌ కరెంటు లైన్‌ పోతుందని సోషల్‌ మీడియాలో ప్రతిపాదనలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో లైన్‌ ఎక్కడినుంచి పోతుందో, తమ భూములు ఎక్కడ లాక్కుంటారోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇండస్ట్రియల్‌ కారీడార్‌కు విద్యుత్‌ సరఫరా చేయడంలో భాగంగా షాద్‌నగర్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా ఐనాపూర్‌ వరకు హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు, ప్రతిపాదిత లైన్లకు సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయా లైన్లకు సంబంధించి పలు గ్రామాల్లో మార్కింగ్‌ చేసినట్లు చెబుతున్నారు. షాద్‌నగర్‌ నుంచి మొగిలిగిద్ద, చిన్న ఎల్కిచర్ల, విశ్వనాథ్‌పూర్‌, చేగిరెడ్డి ఘనాపూర్‌, బండ ఎల్కిచర్ల మీదుగా ఐనాపూర్‌ వరకు ఒక లైన్‌.. తోలుకట్ట, నక్కలపల్లి, రుద్రారం, బొబ్బిలిగామ, చిన్న ఉమ్మెంత్యాల, నిజాంపేట, మేడిపల్లి, చిట్యాల, మోత్కూర్‌ మీదుగా ఐనాపూర్‌ వరకు మరోలైన్‌, షాద్‌నగర్‌, మొగిలిగిద్ద, బైరంపల్లి, కొందుర్గు, ముజాయిత్‌పూర్‌, బండ ఎల్కచర్ల మీదుగా ఐనాపూర్‌ వరకు ఒక లైన్‌.. ఇలా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసి మార్కింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. చివరకు ఏ లైన్‌కు ఆమోదం వస్తుంది. ఎవరి భూములు పోతాయోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

తండ్రి మందలించాడని..

ఉరి వేసుకొని కుమారుడి ఆత్మహత్య

షాబాద్‌: చక్కగా చదువుకోవాలి.. అందరూ మెచ్చేలా పనిచేసుకొని జీవించాలి అని తండ్రి మందలించినందుకు కుమారుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చెన్నారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన జెట్ట లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు చంద్రశేఖర్‌ (16) తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. అన్న, తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వ్యవసాయ పనులకు సరిగ్గా వెళ్లడం లేదని, చదువుకోమంటే మధ్యలో ఆపేశావని, ఏం చేసి బతుకుతావని శనివారం ఉదయం తండ్రి కుమారుడిని మందలించాడు. దీంతో ఇంట్లోంచి వెళ్లిన చంద్రశేఖర్‌ మధ్యాహ్నం వరకు రాలేదు. వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు ఓ ప్రాంతాన్ని గుర్తించి కుటుంబీకులకు తెలియజేశారు. వారు అక్కడికి వెళ్లి వెతగ్గా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement