బషీరాబాద్: మండలంలోని మైల్వార్లో శనివారంసర్పంచ్ సీమా సుల్తానా అధ్యక్షతన నిర్వహించిన వీబీజీరామ్జీ గ్రామసభ రసాభాసగా మారింది. సభకు టెంట్, కూర్చునేందుకు కార్పెట్, తాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై వార్డు సభ్యులు, గ్రామస్తులు కార్యదర్శి అశోక్ను నిలదీశారు. చేయని పనులకు జీపీలో నిధులు ఖర్చుచేసే మీరు.. గ్రామసభకు కనీస వసతులు కల్పించలేరా..? అని ప్రశ్నించారు. దీంతో పంచాయతీ ఆవరణలో వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తప్పుడు లెక్కలంటూ మండిపాటు
పంచాయతీ నిధుల ఖర్చు, వినియోగంపై వార్డు సభ్యులు వినోద్కుమార్, ఎస్.రాజు, గ్రామ యువకులు సెక్రటరీని ప్రశ్నించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి కుమ్మకై ్క పాత పనుల పేరిట సుమారు రూ.28 లక్షలు డ్రా చేశారని ఆరోపించారు. మోటార్ల మరమ్మతుల పేరుతో రూ.2 లక్షలకు పైగా తప్పుడు లెక్కలు చూపించారని మండిపడ్డారు. అయినా నేటికి తాగునీటి ఎద్దడి తీరలేదన్నారు. పంచాయతీకి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలు, నోట్ఫైల్ చూపాలని పలుమార్లు కోరినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఏపీఓ శారద గ్రామసభను రద్దు చేశారు. కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వార్డు సభ్యులు, యువకులు తెలిపారు.
● పంచాయతీ నిధుల ఖర్చులపై ఆరోపణలు
● కార్యదర్శితో ఉప సర్పంచ్, వార్డు సభ్యుల వాగ్వాదం
● సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీఓ


