సాక్షి, రంగారెడ్డిజిల్లా: పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఈ మేరకు గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లిలోని దుర్గాకన్వెన్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. సమావేశానికి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్లమెంట్ ఇన్చార్జులు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నమోదు ప్రక్రియలో ఎక్కడా.. ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. నాయకులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని, పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకొని ప్రతి గ్రాడ్యుయేట్ను కలవాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని తెలిపారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు


