దౌల్తాబాద్: స్థానిక రైతువేదికలో గురువారం ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేకాధికారి పంచాయతీరాజ్ డీఈ సురేష్బాబు హాజరై మాట్లాడారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మండలంలోని సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించగా సర్పంచులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. పీఆర్డీఈ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామైక్య సంఘాల భవనాల నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూగర్భజలాల పెంపునకు జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు వెంకట్స్వామి, వైద్యాధికారిణి అమూల్యప్రియదర్శిని, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


