చందానగర్: అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందిందని చందానగర్ పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉండే మేనమామ గోవింద్ వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్లోకి అతను ఎక్కగానే, ఆమె కూడా అందులోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా లిఫ్టు తలుపులు మూసుకొని పైఅంతస్తులకు దూసుకెళ్లింది. దీంతో ఆమె శారీర సగభాగం లిఫ్టు లోపల, మిగతా భాగం తలుపుల మధ్యలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ కొద్దిగా పైకి వెళ్లి ఆగిపోయింది. వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో హుటాహుటిన వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


