● ఏర్పాట్లు పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు
● పారిశ్రామిక వాడ
భూ నిర్వాసితుల హర్షం
కొడంగల్: దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడలో భాగంగా భూములు అప్పగించిన లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంటతండా రైతులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. హకీంపేట్ సమీపంలో సుమారు వంద ఎకరాల్లో ప్రత్యేకంగా రూపొందించిన డీటీసీపీ లేఔట్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి రెడీ అయ్యాయి. 570 మందికి బుధవారం లక్కీడిప్ విధానంలో ప్లాట్లను కేటాయించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాండూరు ఆర్డీఓ అనిత, స్థానిక తహసీల్దార్ కిషన్ తెలిపారు. కొడంగల్లోని బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ప్లాట్ల జాబితాలో పేరున్న రైతులు హాజరు కావాలని సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు. ఎకరా పట్టా భూమిని కోల్పోయిన ఒక్కో రైతుకు 150 గజాలు, ఎకరా అసైన్డ్ భూమిని ఇచ్చిన వారికి 120 గజాలు, అర ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి కోల్పోయిన వారికి 80 గజాల చొప్పున నివాస స్థలం ఇవ్వనున్నారు.
ఎనిమిది ఎకరాలు ఇచ్చాం..
మా కుటుంబానికి సంబంధించి ఎనిమిదెకరాల భూమిని పారిశ్రామిక వాడ కోసం ప్రభుత్వానికి ఇచ్చాం. పరిహారం అందింది. బుధవారం ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు సమాచారం ఇచ్చారు. ఎకరానికి ఒకటి చొప్పున మాకు ఎనిమిది ప్లాట్లు వస్తాయి.. చాలా సంతోషంగా ఉంది.
– దొరమోని అనంతమ్మ, హకీంపేట్


