గ్రామసభ.. రసాభాస
బొంరాస్పేట: గ్రామ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి చర్చించాల్సిన గ్రామసభ రసాభాసగా మారింది. మండల కేంద్రమైన బొంరాస్పేటలో సర్పంచ్ వీరేశలింగం అధ్యక్షతన శనివారం నిర్వహించిన సభలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం గ్రామ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. పారిశుధ్యం అంశాలపై చర్యలు తీసుకోవాలని సభదృష్టికి తెచ్చారు.
సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలన్నారు. వీధిలైట్లు, ప్రమాదకరంగా ఉన్న కరెంటు తీగలు సరిచేయాలన్నారు. ఉప్పరికాలనీ, గొల్లవాడలకు తాగునీటి సమస్య తీర్చాలన్నారు. అంగన్వాడీలు పాఠశాలల ఆవరణల్లో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని నేతలు సూచించారు. ఇందులో ఎంపీఓ రవినాయక్, పీహెచ్సీ మెడికల్ అధికారి హేమంత్కుమార్, గ్రామ కార్యదర్శి సుచిత్ర, ఉప సర్పంచ్ నందిని, బీజేపీ మండల అధ్యక్షుడు జగదీశ్సాగర్, రామకృష్ణగౌడ్, అనిల్, సంగాయిపల్లి నర్సింలు, రాములు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


