న్యూస్రీల్
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
వికారాబాద్: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాధారణంగా 1.31 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, గత ఏడాది అది 1.41 లక్షల ఎకరాలకు చేరింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 15 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని 1,187 చెరువుల్లో చాలా వరకు ఇంకా నీరు చేరకపోవడం, భూగర్భ జలాలు పెరగకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 20 మండలాల్లో కేవలం ఐదు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదవగా, మిగతా ప్రాంతాల్లో లోటు లేదా అధిక లోటు వర్షపాతం నమోదైంది. వాతావరణం ఇప్పటికీ వేసవిని తలపించేలా ఉండటంతో సాగుపై ప్రభావం పడుతోంది.
ఆందోళనలో కర్షకులు
ఇప్పటికే నాట్లు సిద్ధం చేసుకున్న రైతుల్లో బోరుబావుల నీరు ఉన్నవారు మాత్రమే నాట్లు వేస్తున్నారు. చెరువులు, కుంటలపై ఆధారపడిన రైతులు మాత్రం వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు బోరుబావుల్లోనూ నీటి మట్టం తగ్గిపోవడంతో వేసిన పంట నిలుస్తుందా లేదా అనే సందేహం రైతులను వేధిస్తోంది. అధికారులు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకు, అవసరమైతే సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా వరి నాట్లు వేయవచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యతను బట్టి మాత్రమే వరి సాగు చేయాలని సూచిస్తున్నారు.
ఈ విత్తనాలు అనుకూలం
ప్రస్తుతం జిల్లాలో రైతులు బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, చిట్టిముత్యాలు వంటి రకాల విత్తనాలు సాగు చేస్తున్నారు. అయితే ఖరీఫ్లో సంబామసూరి, బరణి, కాటన్ దొరసన్నలు, సోమశిల, సింహపురి, తెలంగాణ సోనా రకాలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎంటీయూ–1010, ఎంటీయూ–1001 రకాలు రబీ సీజన్కు మరింత అనుకూలమని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలోపు నాట్లు వేస్తే ఎకరానికి సుమారు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, రబీలో మరో 5–10 బస్తాలు అధికంగా వచ్చే అవకాశముందని తెలిపారు.
చెరువులు నిండక తగ్గనున్న సాగు విస్తీర్ణం
15 వేల ఎకరాల్లోనే నాట్లు
వర్షాల కోసం రైతుల ఎదురుచూపు
నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన
వికారాబాద్లో వర్షాభావ పరిస్థితులు


