● బకాయిలను వెంటనే విడుదల చేయాలి
● ఏబీవీపీ నగర అధ్యక్షుడు నర్సింలు
● కళాశాలల బంద్ విజయవంతం
తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ తాండూరు నగర అధ్యక్షులు నర్సింలు ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పథకం అమలు కాకపోవడంతో ఏటా రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమతుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారన్నారు. బకాయి పడిన రూ.11వేల కోట్లను చెల్లించకుండా పథకాన్ని ఎత్తి వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. వెంటనే ఫీజులు విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బంద్లో నాయకులు అజయ్, పవన్, నవీన్, మధుసూదన్ రెడ్డి, ఉమేష్, జాఫర్, భరత్, రాజేష్, కాశిఫ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణయ్య దీక్షకు మద్దతు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు బీసీ సంఘం తాండూరు నాయకులు మద్దతు పలికారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు తాండూరు నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు, నాయకులు అనిత, మంజుల, నర్సమ్మ, పరమేష్, బస్వరాజ్, వివేక్, కిరణ్, యాసర్, అరుణ్, రాజేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


