కుల్కచర్ల: తమకు తెలియకుండా వీఓ శ్రీనివాస్ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేశారని పలువురు మహిళలు ఆరోపించారు. శుక్రవారం చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు లోన్లు ఇప్పించే క్రమంలో రూ.2 లక్షలు డిపాజిట్ చేసి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డబ్బులు తీసుకున్నాడని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన జ్యోతి మహిళా పొదుపు సంఘానికి చెందిన ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. సంఘం పేరిట రూ.11 లక్షల లోను తీసి.. తమకు రూ.7 లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చారని, ఒక లక్ష డిపాజిట్ అని చెప్పి మిగతా డబ్బులు తన సొంతానికి వాడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే డ్రా చేసుకుని, మళ్లీ.. రూ.2 లక్షలు ఖాతాలో జమచేశాడని, మిగతా డబ్బులు తమనే కట్టమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఏపీఎం బాలకృష్ణను వివరణ కోరగా.. సర్పంచ్తో పాటు మరికొంత మంది వీఓ శ్రీనివాస్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారని తెలిపారు. సోమవారం ఒక్కో సంఘం వారీగా విచారణ చేపడతామని వివరించారు.
బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన


