దుద్యాల్: మండల పరిధి గౌరారంలో రూ .29.5 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని శుక్రవారం సర్పంచ్ రాథోడ్ కిష్టిబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో చాలా రోజులుగా వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి భవనాన్ని వినియోగంలోకి తెచ్చామని, ఇక మీదట వైద్యం అందరికీ అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాజామైనొద్దీన్, పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, వైద్యుడు హర్షవర్ధన్, నాయకులు పులిందర్ రెడ్డి, సీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
రామలింగేశ్వరుడికి అడిషనల్ ఎస్పీ పూజలు
కుల్కచర్ల: బండవెల్కిచర్ల గ్రామం పాంబండ రామలింగేశ్వరునికి శుక్రవారం అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు.. అడిషనల్ ఎస్పీని సన్మానించారు. కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, అర్చకులు పాండు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
దోమ: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని పూర్వ విద్యార్థులు అన్నారు. శుక్రవారం మండల పరిధి బొంపల్లిలో 2009– 10బ్యాచ్నకు చెందిన బాల్య మిత్రులు.. స్థానిక మజీద్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. పండ్లు తినిపించి దీక్షలను విరమింపచేశారు.
బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శ్రీశైలం
బషీరాబాద్: ఎస్ఐ శ్రీశైలం యాదవ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందుకు ఇక్కడ పనిచేసిన ఎండీ నుమాన్అలీ వికారాబాద్ ఎస్పీ కార్యాలయం వీఆర్కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో శ్రీశైలం చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని చెప్పారు.
డొమెస్టిక్ సిలిండర్లు సీజ్
ధారూరు: జిల్లా పౌరసరఫరాల అధికారులు శుక్రవారం ధారూరులోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ గ్యాస్ వినియోగాన్ని గుర్తించారు. కమర్షియల్ సిలిండర్లు వాడాల్సిన చోట దొరికిన ఆరు డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ధారూరులోని హెపీ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు.


