● మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ
● ఘనంగా కవయిత్రి జయంతి
తాండూరు టౌన్: సాహిత్య లోకానికి కవయిత్రి మొల్ల ఆదర్శనీయమని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అన్నారు. శుక్రవారం తాండూరులో మొల్ల కళావేదిక, బాలల మాస పత్రిక మొలక సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ దర్భంగా మొల్ల చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో మొల్ల ధృవ తారగా నిలిచారని, ఆమె స్ఫూర్తితో నేటితరం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కవులు, వారి రచనలు, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రముఖ కవయిత్రులు ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి, వాసరచెట్ల జయంతిని మొల్ల అవార్డుతో చైర్పర్సన్ సన్మానించారు. మొల్ల సాహిత్యంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో పాల్గొన్న 60 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించారు. కార్యక్రమంలో మొల్ల కళావేదిక అధ్యక్షుడు కేవీఎం వెంకట్, గౌరవాధ్యక్షుడు సత్యం, బస్వరాజ్, శ్రీనివాసాచారి, బాలకృష్ణ, విజయలక్ష్మి, శంకరమ్మ, గోవిందరావు, ప్రకాష్, ఆనందం, సురేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.


