పోలింగ్ బూత్లు తారుమారు
● ఒకదాని నంబర్ మరొక దానికి వేసిన అధికారులు ● గుర్తించి ఫిర్యాదు చేసిన నాయకులు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్లు తారుమారయ్యాయి. దీంతో ఓటర్లు, నాయకులు అధికారులను ప్రశ్నించారు. 9వ వార్డు పరిధిలోకి గంగారం సాయిబాబాకాలనీ, బూర్గుపల్లి గ్రామం కలిసి ఉన్నాయి. ఈ వార్డుకు రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి బూర్గుపల్లి పోలింగ్ బూత్ నంబర్ 20 కాగా, సాయిబాబాకాలనీ పోలింగ్ స్టేషన్ నంబర్ 21గా ఉంది. ఈ రెండింటి దూరం దాదాపు 4 కిమీల వరకు ఉంటుంది. కాగా ఒక పోలింగ్ బూత్ నంబర్ మరో పోలింగ్ బూత్కు పడటంతో అధికారులు వాటి ఆధారంగా ఏర్పాట్లు చేశారు. పొరపాటును గుర్తించిన నాయకులు, ఓటర్లు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ బూత్ నంబర్లను వెంటనే మార్చాలని కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ను సంప్రదించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు.
దేశ వ్యాప్త సమ్మెను
విజయవంతం చేయండి
షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు ఎన్.రాజు కోరారు. పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు దివాళా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల పద్ధతులను నిరసిస్తూ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, నాయకులు ఈశ్వర్, శ్రీకాంత్, శివ, భుజంగరెడ్డి, రాజు నాయక్, మహ్మద్ బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
యాప్ ద్వారానే
యూరియా పంపిణీ
కందుకూరు: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే రైతులకు యూరియా పంపిణీ జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష సూచించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంతో పాటు ఫర్టిలైజర్ షాపుల్లో యాప్ ద్వారా చేపట్టిన యూరియా పంపిణీ ప్రక్రియను మంగళవారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులు క్యూకట్టే పద్ధతి, పడిగాపులు కాసే పరిస్థితి ఉండదన్నారు. నిర్ధారించిన పంట ఆధారంగా బుక్ చేసుకుంటే ఐడీ వస్తుందని, దాంతోనే బుక్ చేసుకున్న షాపుకు వెళ్లి 48 గంటల్లోపు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకోవడం రాని రైతులు ఏఈఓలు లేదా డీలర్ల వద్దకు వెళ్లి అక్కడ ఉండే వలంటీర్ల సాయం తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, రైతులు, ఫర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు.
షర్ఫూద్దీన్ బాబా సేవలో మాజీ మంత్రి సబితారెడ్డి
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్లోని బాబా షర్ఫూద్దీన్ దర్గా 760వ ఉర్సులో భాగంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మంగళవారం పూలు, చాదర్ సమర్పించారు. దర్గాకు విచ్చేసిన ఆమె తలపై బుట్టలో పూలు, చాదర్తో వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు.
పోలింగ్ బూత్లు తారుమారు
పోలింగ్ బూత్లు తారుమారు


