మదర్ డెయిరీ జీఎంపై సస్పెన్షన్ వేటు
హయత్నగర్: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్ముల్ మదర్ డెయిరీ)లో చోటుచేసుకున్న పరిణామాలు ఇక్కడ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన జనరల్ మేనేజర్ కృష్ణ సస్పెన్షన్కు దారి తీశాయి. కృష్ణ అవకతవకలకు పాల్పడ్డారని, చైర్మన్కు చెప్పకుండా ఫైల్స్ టాంపరింగ్ (దిద్దడం) చేశారన్న ఆరోపణలపై ఇన్చార్జి ఎండీ లింగారెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డెయిరీ పరిధిలోని పాల శీతలీకరణ కేంద్రాలను పర్యవేక్షించకపోవడం, పాల విక్రేతలకు ట్రాన్స్పోర్ట్ కమీషన్ చార్జీలను ఏకపక్షంగా పెంచడం వంటి చర్యలతో డెయిరీకి తీవ్ర నష్టాలు వచ్చాయని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఎండీ స్పష్టం చేశారు.
బోర్డు నిర్ణయాలనే అమలు చేశాం
మదర్ డెయిరీలో ఏ నిర్ణయమైనా పాలక మండలి ద్వారానే జరిగింది. వాటినే నేను అమలు చేశా అని జీఎం కృష్ణ తెలిపారు. సేల్స్ను పెంచేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారని, కమిటీ ప్రతిపాదించిన ధరలనే బోర్డు నిర్ణయించిందని, కమీషన్ పెంచడంతో సేల్స్ బాగా పెరిగిందన్నారు. ప్రస్తుత చైర్మన్ తమను చిల్లింగ్ సెంటర్ల తనిఖీకి వెళ్లనిచ్చే వారు కాదని స్పష్టంచేశారు. డెయిరీలో జరుగుతున్న కుర్చీల ఆటలో తనను బలిపశువును చేశారని, ఎలాంటి వివరణ తీసుకోకుండా, తనను సస్పెండ్ చేయడాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.


