అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
అనంతగిరి: అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతాయన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజ వనరులను తరలిస్తున్న వారిపై నిఘా పెంచి వివిధ పీఎస్ల పరిధిలో ఏక కాలంలో మెరుపుదాడులు నిర్వహించాయన్నారు. జిల్లాలో గత నాలుగు రోజుల్లో 6 ఇసుక ట్రాక్టర్లు, 3 ఎర్రమట్టి టిప్పర్లు, ఒక ఎర్రరాయి లారీ, జేసీబీలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేశామని ప్రకటించారు. బషీరాబాద్ పీఎస్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను, వికారాబాద్ పీఎస్ పరిధిలోని అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నామన్నారు. తాండూరు పీఎస్ పరిధిలో ఒక ట్రాక్టర్, యాలాల పీఎస్ పరిధిలో ఎర్రరాయిని తరలిస్తున్న లారీని పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.


