
మెరుగైన వైద్యం అందించాలి
ధారూరు: మండల పరిధిలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అన్ని వార్డులను కలియ తిరిగి చూశారు. పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో ఖాళీల పోస్టుల వివరాలను డాక్టర్ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. ఆయూష్ విభాగంలో డాక్టర్, సిబ్బంది ఎవరూ లేకపోడంపై విస్మరించారు. రోగుల సేవలు, వసతులు, పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్ పోస్టు ఖాళీగా ఉందని, ఆ పోస్టు భర్తీ అయ్యేలా చూడాలని డాక్టర్ జ్యోతి ట్రైనీ కలెక్టర్కు విన్నవించారు.
ఎక్మాయి యువకుడికి డాక్టరేట్
బషీరాబాద్: మండలంలోని ఎక్మాయి గ్రామానికి చెందిన పోషమొళ్ల వెంకటప్ప ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. విశ్వవిద్యాలయ హ్యాండ్ బాల్ క్రీడాకారులలో శారీరక దారుఢ్యం శారీరక శాస్త్ర సంబంధిత విలువల అభివృద్ధి, శిక్షణ పద్ధతులు వాటి ప్రభావం అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి పీహెచ్డీ పట్టా పొందడం మండలానికే ఆదర్శమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. క్రీడారంగంలో వెంకటప్ప అద్భుతమైన ప్రతిభను చాటారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ హ్యాండ్ బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి సీనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ పోటీల్లో కాంస్యపతకం సాఽధించారు. ఈ నెల 19వ తేదీన యూనివర్సిటీలో గవర్నర్ ఇస్రో మాజీ చైర్మన్, వైస్ చాన్స్లర్ చేతుల మీదుగా పీహెచ్డీ ప్రదానం చేయనున్నారని వెంకటప్ప మంగళవారం తెలిపారు.
వివాహిత అదృశ్యం
కేశంపేట: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని లేమామిడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపంగి మల్లేశ్కు కల్వకుర్తి మండలం సిలార్పల్లి గ్రామానికి చెందిన గీతతో గతేడాది వివాహం జరిగింది. అయితే గీత రాఖీ పండగకు పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
మాడ్గుల: అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. దోడ్లపహడ్కు చెందిన జంగయ్యగౌడ్ (38)నగరంలో ఆటో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల అప్పుల బాధలు ఎక్కువ కావడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తన పొలానికి పురుగుల మందు తాగాడు. అక్కడికి వెళ్లిన భార్యాపిల్లలు ఇది గమనించి చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మెరుగైన వైద్యం అందించాలి