
నులిపురుగులను నలిపేద్దాం
● వైద్యుల పర్యవేక్షణలోనే అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి ● కలెక్టర్ ప్రతీక్జైన్
అనంతగిరి: ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం వికారాబాద్లోని కొత్త గడి బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొంతమంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేషనల్ డీ వార్మింగ్ డేకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. నులిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. వాటి నివారణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలు పంపిణీ చేసినట్లు వివరించారు. నులిపురుగుల కారణంగా ఆహారం ఎంత తీసుకున్నా బరువు పెరగరని, బలహీనంగా ఉంటారని తెలిపారు. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చని పేర్కొన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే మాత్రలు వేసుకోవాలన్నారు. ఈ రోజు స్కూళ్లకు రాని పిల్లలకు 19వ తేదీ వరకు అంగన్వాడీ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి మాత్రల పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి, శిశు సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, డాక్టర్ పవిత్ర, రెసిడెన్షియల్ వైస్ప్రిన్సిపాల్ మంజుల, ప్రోగ్రాం అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించా లని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 అర్జీలు వచ్చాయి. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
నులి పురుగులను నివారించాలి
కొడంగల్: ిపల్లల్లో నులి పురుగులను నివారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లలితాదేవి, డిప్యూటీ డీఎం హెచ్ఓ డాక్టర్ రవీంద్రా యాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, అంగడిరాయిచూర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.